
భారత్ తరఫున 41 ఏళ్ల తర్వాత మరోసారి ఓ వ్యోమగామి రోదసిలోకి పయనించడం గర్వకారణంగా మారింది. యాక్సియం-4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా జూన్ 25న అమెరికాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి వెళ్లారు.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01కి లాంచ్ అయిన ఈ ప్రయోగంలో శుభాంశుతో పాటు హంగేరీ, పోలాండ్కు చెందిన వ్యోమగాములు పాల్గొన్నారు. ఇది ఫ్రాన్స్, యూరప్, అమెరికా, భారత అంతరిక్ష సంస్థల సహకారంతో సాగుతున్న మిషన్ కావడం విశేషం.
తొలితర వ్యోమగామి రాకేశ్ శర్మ తరువాత అంతరిక్ష కేంద్రం అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలిచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వరకూ ప్రయాణించే తొలి భారతీయుడిగా కూడా గుర్తింపు పొందుతున్నారు.
లాంచ్కు ముందు శుభాంశు ‘ఫైటర్’ సినిమాలోని ‘వందే మాతరం’ పాట వింటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రయోగ అనంతరం “ఇది కేవలం ప్రయాణం కాదు.. భారత అంతరిక్ష యాత్రకు బలమైన పునాది” అని పేర్కొన్నారు.
భూమిని సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో చుట్టేస్తున్నామని వివరించిన శుభాంశు, రాకెట్ నుంచే భారత ప్రజలతో మాట్లాడడం విశేషం. ఈ ప్రయోగం ముందుగా మే 29న జరగాల్సి ఉండగా, చివరికి ఇన్ని రోజులకు విజయవంతంగా లాంచ్ అయింది.
తల్లిదండ్రులు లఖ్నవూ నుంచి ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. కుమారుడి సాహసయాత్ర చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శుభాంశు మిషన్ పైలట్గా, అమెరికా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు.