
న్యూస్ డెస్క్: రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1′ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డ్ లను కూడా బ్రేక్ చేసిందని తెలుస్తోంది. ఈ అనూహ్య విజయంపై హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తాజా మీడియా ఇంటరాక్షన్లో సంతోషం వ్యక్తం చేశారు.
అయితే, ఈ విజయం తన ఒక్కడిది కాదని, సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిదనీ, ముఖ్యంగా సినిమాను ఆదరించిన ప్రేక్షకుల విజయం అని ఆయన పేర్కొన్నారు.
‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్ల జోరుపై మాట్లాడుతూ, “రికార్డులు అనేవి నటుడికి, దర్శకుడికి సంబంధించినవి కావు. అవి పూర్తిగా ప్రేక్షకులు ఇచ్చింది, వారికే చెందుతుంది.
ఒక సినిమాను ఎంత దూరం తీసుకు వెళ్లాలో వారే నిర్ణయిస్తారు” అని రిషబ్ అన్నారు. సినిమాను చూసిన ప్రతి ఒక్కరికీ ఈ రికార్డ్ సొంతమని ఆయన చెప్పారు.
సినిమాకు కన్నడంలో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఇతర భాషల్లో అనుకున్నంత స్థాయిలో టాక్ రాలేదు. దీంతో వసూళ్లు ఎలా ఉంటాయో అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ వసూళ్ల విషయంలో ఈ సినిమా ఆ అంచనాలను దాటి దూసుకుపోవడం విశేషం.
దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న రిషబ్, నటుడిగా ముఖ్యంగా క్లైమాక్స్లో తన అద్భుత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
రిషబ్ శెట్టి నటనకు మరోసారి అవార్డుల పంట పండటం ఖాయం అని సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘కాంతార’ వంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు తనకు ఎప్పటికీ చాలా సంతోషంగా ఉంటుందని రిషబ్ చెప్పారు.
