
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలలో ఆయన కాంతార సినిమా గురించి మాట్లాడారు.
రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి నటన అద్భుతమన్నప్పటికీ.. హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశాలను కామెడీగా ఇమిటేట్ చేసి చూపించారు. అత్యంత పవిత్రంగా భావించే పంజుర్లి దైవాన్ని అవమానించారని కన్నడిగులు హిందూ జన జాగృతి సమితి మండిపడ్డాయి.
దీంతో రణ్వీర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. విమర్శలు తీవ్రం కావడంతో రణ్వీర్ సింగ్ ఎట్టకేలకు దీనిపై స్పందించారు.
తన ఉద్దేశం రిషబ్ శెట్టి అద్భుతమైన నటనను హైలెట్ చేయడమే అన్నారు. నటుడిగా ఆ ప్రత్యేక సన్నివేశాన్ని ప్రదర్శించడానికి ఎంత టాలెంట్ అవసరమో తనకు తెలుసు అన్నారు.
మన దేశంలోని ప్రతి సంస్కృతి సాంప్రదాయం నమ్మకాన్ని తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని రణ్వీర్ సింగ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే, తాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకు వచ్చారు.
