
తెలుగు సినిమాలకు ఓటీటీ శాటిలైట్ రైట్స్ మార్కెట్ తగ్గిపోయిందని నిర్మాతల్లో ఆందోళన పెరుగుతోంది. 2024 చివరి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఈ సంకట పరిస్థితిపై అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట గోపి ఆచంట ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది.
నిజానికి ఈ ముప్పు అంతా లాక్డౌన్ తోనే వచ్చిందని వారు విశ్లేషించారు. ఆ సమయంలో జనం ఇళ్లలో ఉండి ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఓటీటీల్లో ఒరిజినల్ కంటెంట్ సరిపోక ఇతరుల కంటెంట్ను భారీ మొత్తాలకు కొనుగోలు చేశారు.
అయితే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత జనం తమ పనులతో బిజీ అయ్యారు. ఓటీటీ వీక్షణ సమయం తగ్గింది. అదే సమయంలో సినిమాల నిర్మాణం పెరిగింది. అందువల్ల ఓటీటీలకు ప్రత్యామ్నాయ కంటెంట్ చాలా ఉంది.
దీని పర్యవసానంగా, ఓటీటీ కంపెనీలు ఇప్పుడు ధరలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. థియేటర్లలో కమర్షియల్గా ఎంత బాగా ఆడింది అనేదానిని బట్టి ధరలు నిర్ణయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
నిర్మాతలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. లాక్డౌన్ సమయంలో పెంచిన రేటు వాస్తవ ధర కాదు. ఇప్పుడు స్థిరీకరించిన రేటు మాత్రమే ఉంటుంది. దానికి తగ్గట్టే సినిమాల బడ్జెట్లు కేటాయించాలని నిర్మాతలు సూచించారు.
ఓటీటీ మార్కెట్ను విశ్లేషించిన ఈ నిర్మాతలు తమ అనుభవంతో ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక చేశారు. థియేటర్లో ఆడే సినిమాకే ఓటీటీలో విలువ ఉంటుందని ఈ పరిస్థితి నిరూపిస్తోంది.
