
తమిళ స్టార్ హీరో, రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన విజయ్ తన టీవీకే పార్టీపై పెద్ద షాక్ను ఎదుర్కొంటున్నారు. కరూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
విజయ్ ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. స్వతంత్ర దర్యాప్తు ద్వారానే నిజాలు వెలుగులోకి వస్తాయని టీవీకే వర్గాలు అంటున్నాయి.
టీవీకే ఆరోపణల ప్రకారం, ర్యాలీ ప్రశాంతంగా జరుగుతుండగా అకస్మాత్తుగా రాళ్ల దాడులు జరిగాయి. వెంటనే పోలీసులు లాఠీచార్జ్ చేయడం పరిస్థితిని అదుపు తప్పేలా చేసిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు భావిస్తున్నారు.
ఈ ఘటన తర్వాత విజయ్ చెన్నై చేరుకుని పార్టీ కీలక నేతలతో, లీగల్ టీంతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం టీవీకే లీగల్ సెల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్పై రేపు విచారణ చేపట్టనుంది. దీంతో ఈ కేసు రాజకీయ రంగంలో మరింత చర్చనీయాంశంగా మారింది.
