
హైదరాబాద్ అంటే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు ఎంతో ఇష్టం. తన సోదరి అర్పితా ఖాన్ పెళ్లి వేడుక నుంచి మొదలుకొని, సినిమా షూటింగుల వరకు భాగ్యనగరాన్నే డెస్టినేషన్గా ఎంచుకుంటారు. ఇన్నాళ్లూ కేవలం అతిథిగా మాత్రమే వచ్చిన సల్మాన్, ఇప్పుడు హైదరాబాద్తో తన బంధాన్ని వ్యాపారపరంగానూ విస్తరించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ హైదరాబాద్ శివారులో ఒక అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో నిర్మించే యోచనలో ఉన్నారు. దీనికోసం ఏకంగా 50 నుంచి 60 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మెగా ప్రాజెక్ట్ గురించి మాట్లాడారని, సీఎం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ (కందుకూరు మండలం, మిర్ఖాన్పేట)లో ఈ స్టూడియో రాబోతోంది. ఇక్కడ స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా భూమి కేటాయింపులో రాయితీలు, ఇతర సహకారం అందించేందుకు ఆఫీసర్లు రెడీగా ఉన్నారు. ఇది గనక కార్యరూపం దాల్చితే ఆ ప్రాంతం డెవలప్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది.
వచ్చే నెల (డిసెంబర్ 8, 9) హైదరాబాద్లో జరగనున్న ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ వేదికగా ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడే ప్రభుత్వం మరియు సల్మాన్ టీమ్ మధ్య ఎంవోయూ (MoU) కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా జరుగుతుండటంతో, సల్మాన్ ఎంట్రీతో దానికి గ్లోబల్ క్రేజ్ రావడం ఖాయం.
ఇప్పటికే మన దగ్గర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ, రామానాయుడు వంటి టాప్ స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు సల్మాన్ స్టూడియో కూడా తోడైతే హైదరాబాద్ సినీ హబ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నీ ఒకే చోట దొరికేలా హై-ఎండ్ టెక్నాలజీతో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది టాలీవుడ్కే కాదు, ఇండియన్ సినిమాకే కొత్త ఆకర్షణ కానుంది.
