
న్యూస్ డెస్క్: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా, టర్కీ వేదికగా జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చల్లో ఇరు దేశాలు మానవతా అంశాలపై కీలక అంగీకారానికి వచ్చాయి.
టర్కీ సిరాగన్ ప్యాలెస్లో సోమవారం జరిగిన ఈ భేటీ గంటకు పైగా సాగింది. ఈ చర్చల్లో 6,000 మంది సైనికుల మృతదేహాలను పరస్పరం మార్పిడి చేసుకోవాలని ఇరుపక్షాలు ఒప్పందానికి వచ్చాయి.
ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూలు, ముఖ్యంగా గాయపడిన యోధుల మార్పిడిపై కొత్త ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు.
ఈ సమావేశానికి టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ అధ్యక్షత వహించగా, టర్కీ నిఘా సంస్థలు కూడా చర్చల్లో భాగమయ్యాయి. చర్చల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, “మేము ఖైదీల విడుదలకు సిద్ధంగా ఉన్నాం” అని విల్నియస్లో తెలిపారు.
అయితే, శాంతి కోసం అవసరమైన ముఖ్యమైన షరతుల విషయంలో ఇరుపక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాంతాల్లో దాడులు ఇంకా ఆగలేదు. ఈ చర్చలతో సమాధానానికి మార్గం ఏర్పడుతుందా అనేది చూడాలి.
Russiaukraine, peacetalks, turkeymediation, powexchange, warupdate,