
స్పోర్ట్స్ డెస్క్: పోర్చుగీస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన భవిష్యత్పై అంచనాలకు తెరదించారు. సౌదీ అరేబియాలోని అల్-నాసర్ క్లబ్తో మరో రెండు ఏళ్లపాటు కొనసాగేలా భారీ ఒప్పందానికి అంగీకరించారు. 2027 వరకు ఆయన అదే క్లబ్కు ప్రాతినిధ్యం వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలి కాలంలో క్లబ్ ప్రదర్శన బలహీనంగా ఉండటంతో రొనాల్డో యూరప్కి తిరిగి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ అల్-నాసర్ అందించిన ఆకర్షణీయమైన కాంట్రాక్ట్ అతనికి ఆలోచన మార్చేలా చేసింది. గత రెండు సీజన్లలో టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ, లీగ్ టైటిల్ మాత్రం రాకపోవడం ఆయన్ను నిరాశపరిచింది.
ఈ కొత్త ఒప్పందంలో భాగంగా రొనాల్డోకు ఏడాదికి రూ. 890 కోట్లు వేతనం లభిస్తుంది. అలాగే సైనింగ్ బోనస్, ట్రోఫీల బోనస్, గోల్స్, అసిస్ట్లకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. రెండేళ్లలో బోనస్లు 20% పెరుగుతాయి.
అంతేకాదు, అల్-నాసర్ క్లబ్లో 15% యాజమాన్య వాటా, స్పాన్సర్షిప్ డీల్స్, ప్రైవేట్ జెట్ ప్రయాణాల ఖర్చులూ క్లబ్ భరించనుంది. ఇదంతా రొనాల్డోకు గ్లోబల్ క్రీడా చరిత్రలోనే అత్యంత భారీ డీల్గా నిలుస్తోంది.
సౌదీ ఫుట్బాల్ అభివృద్ధిలో రొనాల్డో కీలకంగా నిలిచారు. ఆయన వచ్చిన తర్వాత అనేక స్టార్ ఆటగాళ్లు సౌదీ లీగ్ వైపు మళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనను నిలుపుకోవడమే లక్ష్యంగా ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది.
ఈ ఒప్పందంతో రొనాల్డో తన కెరీర్ ముగింపు ఘట్టాన్ని సౌదీ అరేబియాలోనే పూర్తిచేసే అవకాశం కనిపిస్తోంది. అభిమానులంతా ఈ డీల్ను ఆసక్తిగా గమనిస్తున్నారు.