
పాన్ ఇండియా రేంజ్లో తెలుగు సినిమా కనిపిస్తున్నా.. లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు మాత్రం వేళ్లతో లెక్క పెట్టే విధంగా ఉన్నాయి. ఈ సమయంలో ఓటీటీ సంస్థలు పెడుతున్న కొత్త కండీషన్స్ నిర్మాతలకు మరింత టెన్షన్ పెడుతున్నాయి.
ఒకప్పుడు థియేట్రికల్ రైట్స్ ఎలా ఉన్నా డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాత సేఫ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్తగా ఓటీటీ సంస్థలు.. సినిమా థియేట్రికల్ రన్ మీద ఆధారపడి డీల్ ఉంటుందని మెలిక పెట్టాయట.
ఏదైనా ఒక సినిమాకు ఓటీటీ రైట్స్ ఒక రేటు ఫిక్స్ చేస్తారు. ఆ సినిమా థియేట్రికల్ రిలీజై సక్సెస్ అయితే ఆ రేటు ఇస్తారు. ఒకవేళ థియేట్రికల్ రన్ ఆ లెక్కకు రీచ్ కాకపోతే ఓటీటీ రైట్స్ లో ఏకంగా 25 శాతం కోత ఉంటుందని చెబుతున్నారు.
ఆల్రెడీ ఓటీటీల ద్వారా సినిమాలకు నష్టం జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నా, ఈ కొత్త కండీషన్ వల్ల మరింత లాస్ వచ్చేలా ఉంది. సినిమా బడ్జెట్ను రికవరీ చేసుకోవడానికి ఓటీటీలతో డీల్ చేసుకునే నిర్మాతలకు ఇది పెద్ద షాక్.
మెజారిటీ నిర్మాతలు ఈ నిర్ణయాన్ని ఆమోదించకపోయినా, ఓటీటీల చేతుల్లో సినిమా పరిశ్రమ ఉండటంతో వారికి ఓకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై నిర్మాతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
