
సినీ ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారిన పైరసీపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. దాదాపు రూ.2 కోట్ల ఖర్చుతో అధునాతన పరికరాలను వాడి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నారు. ఇప్పుడు లక్ష్యం ఓటీటీలో దుమ్మురేపుతున్న ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులపైనే ఉంది.
ఇటీవల హైదరాబాదులో సినీ పరిశ్రమ ప్రముఖులతో జరిగిన సమావేశంలో పోలీసులు పైరసీ ముఠాల పనితీరును పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, నాగచైతన్య, దిల్ రాజు వంటి పలువురు పాల్గొన్నారు.
సినిమాలు థియేటర్లలోకి రాకముందే హెచ్డీ ప్రింట్లు బయటకు రావడంపై సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హ్యాకర్లు డిజిటల్ మీడియా సర్వర్లలో బలహీనతలను వాడుకొని పైరసీ ముఠాలకు సినిమాలు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా బెట్టింగ్ యాప్లే ఈ పైరసీ ముఠాలకు నిధులు అందిస్తున్నాయని ఆధారాలతో చూపించారు. దీంతో ఇకపై సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయరాదని టాలీవుడ్ నిర్ణయించింది.
డిజిటల్ మీడియా సంస్థలు కూడా తమ సైబర్ భద్రతను పటిష్టం చేసుకోవాలని హామీ ఇచ్చాయి. పైరసీని కట్టడి చేసేందుకు మరింత ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు.
సైబర్ క్రైమ్ అధికారి సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశాం. త్వరలోనే ఐబొమ్మ హెడ్ కూడా అరెస్టవుతాడు” అని తెలిపారు.
