
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న ఛాలెంజింగ్ స్టార్ దర్శన్కి కోర్టు ఊరట ఇచ్చింది. తాజాగా బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు కొన్ని ప్రాథమిక సౌకర్యాలను అనుమతిస్తూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
దర్శన్ ప్రతిరోజు వాకింగ్ చేసుకునే వెసులు బాటు కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా దిండు, దుప్పటి, మంచం వాడుకునే అవకాశం ఇవ్వాలని తెలిపింది. అధికారులు ఆయనను బళ్లారి జైలుకు తరలించాలని కోరగా, కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఉన్న జైలులోనే అవసరమైన సౌకర్యాలు అందించాలని ఆదేశించింది.
గతంలో జైలు నుంచి లీకైన ఫోటోలు పెద్ద వివాదానికి దారితీశాయి. స్నేహితులను కలవడం, పార్టీ చేసుకోవడం వంటి చిత్రాలు బయటకు రావడంతో, డబ్బు, పలుకుబడి ఉంటే జైలులో కూడా విలాస జీవితం సాగుతుందని విమర్శలు వెల్లువెత్తాయి.
మొదటి సారి జైలులో ఉన్నప్పుడు అలాంటి సౌకర్యాలు దొరకగా, ఇప్పుడు రెండోసారి చేరిన తరువాత కఠిన నియమాలు అనుభవించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శన్ కోర్టును ఆశ్రయించారు.
కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, కేసు విచారణ మాత్రం కీలక దశలో ఉంది. రాబోయే రోజుల్లో సాక్షులను హాజరు పరచనున్నారు. దర్శన్ అండ్ కోపై పోలీసులు పలు ఆధారాలు సేకరించారని సమాచారం.
ఈ కేసులో తుది తీర్పు రావడానికి ఇంకా సమయం ఉండగా, ప్రస్తుతానికి దర్శన్ చిన్న ఊరట పొందినట్టైంది.
