
ప్రఖ్యాత హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బామ్మ అల్లు కనకరత్నమ్మ ఇకలేరు. 94 ఏళ్ల వయసులో వృద్ధాప్య కారణాలతో శనివారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.45 గంటలకు ఆమె కన్నుమూశారు. అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకురానున్నారు.
ఈ వార్త తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. రామ్ చరణ్ మైసూర్ నుంచి, అల్లు అర్జున్ ముంబై నుంచి హుటాహుటిన బయల్దేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను చిరంజీవి, అల్లు అరవింద్ పర్యవేక్షిస్తున్నారు.
సినీ పరిశ్రమలో ఎన్నో తరాలకు మద్దతుగా నిలిచిన అల్లు కుటుంబం ఈ నష్టాన్ని తట్టుకోలేకపోతుంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
