
తెలంగాణ: మంత్రి సీతక్కపై మావోయిస్టులు చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఎప్పుడూ తన ఆదివాసీ మూలాలను మరిచిపోలేదని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని అన్నారు. ములుగులో మీడియాతో మాట్లాడిన మంత్రి, మావోయిస్టుల విమర్శలు అసత్యమని ఖండించారు.
వివాదాస్పదంగా మారిన జీవో 49ను తానే మొదట వ్యతిరేకించానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ జీవో ఆదివాసీ హక్కులకు భంగం కలిగిస్తుందని భావించి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. అటవీశాఖ అధికారులకు జోలికివద్దని తానే ఆదేశించినట్టు తెలిపారు.
కొంతమంది అధికారులు మాత్రమే రాజకీయ ప్రోద్బలంతో నిబంధనలు అతిక్రమిస్తున్నారని, మిగతా అధికారులు ఆదివాసీల పక్షాన ఉన్నారన్నారు. ఆదివాసీలను ఇబ్బంది పెట్టవద్దని తాను, కొండా సురేఖ కలిసి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇంతకుముందు మావోయిస్టులు మంత్రి సీతక్కకు ఓ లేఖ రాశారు. ఆమె ఒకప్పుడు ఉద్యమకారిణిగా ఉండి, ఇప్పుడు ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఆదివాసీల హక్కులను గాలికొదిలేశారని ఆరోపించారు.
ప్రత్యేకంగా కుమురం భీమ్ జిల్లాలో 339 ఆదివాసీ గ్రామాల ఖాళీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ లాభాల కోసమే జీవో 49 తీసుకొచ్చారని విమర్శించారు.
ఈ లేఖకు తక్షణంగా స్పందించిన సీతక్క, తన ఆచరణ, ఆదేశాలు ఆదివాసీలకు అనుకూలంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.