
నటుడిగా కంటే నిర్మాతగానే రానా దగ్గుబాటి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ద్వారా కంటెంట్ ఆధారిత చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమలో కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు.
కేవలం సురక్షితమైన కమర్షియల్ ఫార్ములాలకే పరిమితం కాకుండా, రిస్క్ ఉన్న కథలను కూడా ఆయన ధైర్యంగా ఎంచుకుంటున్నారు. అంతేకాదు, ఇతర నిర్మాతలను కూడా ఒప్పించి, కొత్త తరహా కథల వైపు వారి అభిరుచులను మారుస్తూ, నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన పాన్-ఇండియా స్థాయిలో దుల్కర్ సల్మాన్తో ‘కాంత’ అనే పీరియాడిక్ థ్రిల్లర్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్పై ఉండగానే, ఆయన తన దృష్టిని బాలీవుడ్ వైపు సారించారు.
‘స్పిరిట్ మీడియా’ ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తొలి ప్రయత్నంగా, ప్రతిభావంతుడైన నటుడు మనోజ్ బాజ్పాయ్తో ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ నవల ఆధారంగా ఓ చిత్రాన్ని రానా ప్రకటించారు.
దీంతో పాటు, తమిళంలో సంచలనం సృష్టించిన ‘మానాడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే, ఆయన అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.
రానా తాత, దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు దేశంలోని అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు రానా కూడా నిర్మాతగా అదే బాటలో పయనిస్తూ, తాతయ్య రికార్డును అందుకోవాలని చూస్తున్నారా అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
