
వెండితెరపై నవ్వులు పూయించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవితం ఇప్పుడు కన్నీటి పర్యంతమైంది. ఒకప్పుడు వందల సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె, ప్రస్తుతం తినడానికి తిండి లేక, ఉండటానికి నీడ లేక రోడ్డున పడ్డారు. వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
ఇన్నాళ్లు తన కూతురితో కలిసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో తలదాచుకున్న శ్యామలకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో, తాము సేవలు చేయలేమంటూ నిర్వాహకులు ఆమెను, ఆమె కూతురిని బయటకు పంపించేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యే శరణ్యం అనుకునే స్థాయికి ఆమె వెళ్ళిపోయింది.
రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో ఉన్న వీరిని గమనించిన కార్ఖానా పోలీసులు వెంటనే స్పందించారు. ఏసీపీ రమేష్ చొరవతో వారిని అక్కడి నుంచి తరలించారు. మానవత్వంతో స్పందించి వారి బాగోగులు చూసుకునేందుకు ముందుకు వచ్చారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి పోలీసులు రియల్ హీరోలు అనిపించుకున్నారు.
ప్రస్తుతం పావలా శ్యామలను ఆమె కూతురిని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్ లో చేర్పించారు. అక్కడి ఫౌండర్ రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించడమే కాకుండా, అన్ని రకాల సేవలు అందిస్తామని మాటిచ్చారు. దీంతో ఇన్నాళ్లకు ఆమెకు ఒక భరోసా దొరికినట్లయింది.
గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు సాయం చేసినా, ఆమె కష్టాలు మాత్రం తీరలేదు. సినిమాల్లో అందరినీ నవ్వించిన నటి, నిజ జీవితంలో ఇలాంటి కష్టాలు పడటం చూసి నెటిజన్లు, సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆమెకు శాశ్వత పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నారు.
