
బుధవారం తెల్లవారుజామున భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్రవాద వర్గాల్లో భయాందోళనలు రేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి.
ముఖ్యంగా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి.
భారత వైమానిక దళాలు తెల్లవారుజామున 1.05 గంటలకు బహవల్పూర్ ప్రాంతంపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు చెందిన కుటుంబ సభ్యులు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మృతుల్లో అతని సోదరి, బావ, మేనల్లుడు ఉన్నారని తెలిసింది. ఈ విషయం బయటకు రావడం పాక్ భద్రతా వర్గాల్లో కలకలం సృష్టించింది.
బీబీసీ ఉర్దూ కథనాల ప్రకారం, ఈ దాడుల్లో మరణించిన వారిలో నలుగురు సహాయకులు కూడా ఉన్నారు. మసూద్ అజార్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో పాక్ ఉగ్రవాద సంస్థలు తీవ్ర ఆందోళనలోకి వెళ్లాయి.
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ సైనిక శక్తిని ప్రదర్శించడమే కాక, పాకిస్థాన్కి గట్టి హెచ్చరికను అందించింది. ఈ ఘటనతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగే అవకాశం కనిపిస్తోంది.