న్యూస్ డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఉద్యోగులను తొలగించిన సంస్థ, ఇప్పుడు మూడో విడత కోతల కోసం ప్రణాళికలు రూపొందిస్తోందని బ్లూమ్బర్గ్ నివేదించింది.
ఇంతవరకూ తొలగింపుల వేట ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డెవలపర్లపై పడ్డ, జులైలో జరగబోయే లేఆఫ్లు ప్రధానంగా సేల్స్ విభాగంపై ఉండనున్నాయని సమాచారం. సంస్థ కొత్త ఆర్థిక సంవత్సరం జులైలో ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో, పునర్వ్యవస్థీకరణ చర్యలకు ఇది ప్రాతినిధ్యంగా మారనుంది.
ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు చేస్తున్న మైక్రోసాఫ్ట్, ఆ ఖర్చును సమతుల్యం చేయడం కోసం ఈ చర్యలు చేపడుతోందని నిపుణులు భావిస్తున్నారు. మేలోనే 6,000 మందిని తొలగించిన సంస్థ, వెంటనే మరో 300 మందికి నోటీసులు జారీ చేసిన విషయం గుర్తుండాలి.
2023లో కూడా 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు తిరిగి అదే దిశగా ప్రయాణిస్తుండటం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా సేల్స్ విభాగానికి చెందిన 45,000 మందిలో ఎవరి ఉద్యోగం సురక్షితమో తెలియని పరిస్థితి ఏర్పడింది.