
న్యూస్ డెస్క్: జూలై నెల జీఎస్టీ వసూళ్ల డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లను తాకాయి. గత ఏడాది జులైతో పోల్చితే 7.5 శాతం పెరుగుదల ఉంది. దేశీయ లావాదేవీలు, దిగుమతుల ఆదాయం వృద్ధికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.
అయితే, ఇటీవలి నెలలతో పోలిస్తే వృద్ధి రేటు కొంత తక్కువగా ఉంది.
ఏప్రిల్-జులై మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ. 8.18 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 10.7 శాతం పెరిగాయి. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 35,470 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 44,059 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 1,03,536 కోట్లు, సెస్ రూ. 12,670 కోట్లు వసూలయ్యాయి.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సగటు వసూళ్లు రూ. 2.1 లక్షల కోట్లు కాగా, జులైలో మాత్రం రూ. 1.8 లక్షల కోట్లకు పరిమితమైంది. రీఫండ్లు పెరగడం వల్ల నికర ఆదాయం రూ. 1,68,588 కోట్లుగా నమోదైంది.
రాష్ట్రాల వారీగా చూస్తే త్రిపురా 41 శాతం, మేఘాలయ 26 శాతం వృద్ధితో ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ కూడా వృద్ధి చూపాయి. కానీ మణిపూర్, మిజోరంలో వసూళ్లు తగ్గాయి.
తయారీ రంగం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరడంతో జులైలో ఆర్థిక ప్రగతి బలపడింది.