
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తన దౌత్యపరమైన చర్యలను వేగవంతం చేసింది. ఉగ్రవాదం వెనుక ఉన్న సరిహద్దు మూలాలను ప్రపంచానికి తెలియజేసే దిశగా విదేశాంగ శాఖ చురుకైన ప్రయత్నాలు ప్రారంభించింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బుధవారం డెన్మార్క విదేశాంగ మంత్రి లార్స్ లొక్కె రాస్ముస్సెన్, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యహ్యాలతో టెలిఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఘటనలో వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
దాడికి పాల్పడినవారిని చట్టం ముందు నిలబెట్టాలన్న భారత్ సంకల్పాన్ని జైశంకర్ మంత్రులకు వివరించారు. అంతేకాదు, ఈ దాడికి కారణమైన శక్తులను అంతర్జాతీయంగా బహిర్గతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఇంతకు ముందు జైశంకర్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశాల విదేశాంగ మంత్రులతో కూడా చర్చలు జరిపారు. పాకిస్థాన్ కూడా భద్రతామండలిలో సభ్యత్వం పొందిన నేపథ్యంలో, ఈ చర్చలు కీలకంగా మారాయి.
భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై అంతర్జాతీయ మద్దతు సాధించేందుకు దౌత్యపరంగా ముందడుగు వేస్తోంది. పహల్గాం దాడిని ప్రపంచం ముందుంచి, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది.