
ఆంధ్రప్రదేశ్: జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల సందర్భంగా కూటమి హామీల్లో భాగంగా మార్కాపురం, పోలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేక జిల్లాల హామీలను చంద్రబాబు గుర్తు చేశారు. వీటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ క్రమంలో ప్రజా ప్రాతినిధ్యం ఉన్న నేతలతో పాటు, జనసేన, బీజేపీ ప్రతినిధులు, స్థానిక సంఘాల ప్రతినిధులతో చర్చించి నివేదిక తయారు చేయాలని సూచించారు. ప్రజాభిప్రాయంతో నివేదిక తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రతీ ప్రాంతం యొక్క అవసరాలు, జనసాంద్రత, అభివృద్ధి అవకాశాల ప్రకారం జిల్లాల విభజన జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పాలన మరింత సమర్థవంతంగా జరిగేలా ఈ పునర్విభజన ఉండాలన్నారు.
ఈ అంశంపై త్వరితగతిన నివేదిక సిద్ధం చేసి, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు.