
తిరుమల: శ్రీవారి ఆలయ గగనతలంపై మరోసారి విమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉదయం మూడు విమానాలు ఆనంద నిలయం పైగా ప్రయాణించడం భక్తులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది.
తిరుమల ఆగమ నియమాల ప్రకారం ఆలయం పైభాగంలో ఏ రకమైన విమాన ప్రయాణాలు నిషిద్ధం. గత కొన్ని రోజులుగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ఉదయం కూడా ఒక విమానం ఆలయం పైగా వెళ్ళినట్టు సమాచారం. ఈ విషయంలో టీటీడీ భద్రతా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం జరుగుతోందో పరిశీలన ప్రారంభించారు.
భక్తులు ఇప్పటికే తిరుమల ప్రాంతాన్ని “నో ఫ్లై జోన్”గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పుణ్యక్షేత్రం మీదుగా విమానాలు వెళ్ళడం శాస్త్రోక్తంగా సరైంది కాదని, ఇది భద్రతా పరంగానూ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
ప్రతిష్టాత్మక క్షేత్రం భద్రతకు సంబంధించి మరింత కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు.