
హైదరాబాద్: టెక్నాలజీపై తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆసక్తి గణాంకాలుగా మారుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా నివేదిక ప్రకారం, రాష్ట్ర జనాభాను మించిపోయే స్థాయిలో మొబైల్ నంబర్ల వినియోగం పెరిగింది.
సెప్టెంబర్ 2024 నాటికి తెలంగాణలో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు కాగా, వీరిలో మొబైల్ ఫోన్ వినియోగదారులు 4.4 కోట్లు ఉన్నారు.
పట్టణ ప్రాంతాల్లో మొబైల్ వినియోగం 59 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో అది 41 శాతంగా ఉంది. ల్యాండ్లైన్ వినియోగదారుల విషయంలో మాత్రం 96 శాతం మంది పట్టణాల్లోనే ఉండటం గమనార్హం.
మొబైల్ ఫోన్ల విస్తరణలో రాష్ట్ర వైర్లెస్ టెలీ డెన్సిటీ 105.32 శాతంగా నమోదైంది. అంటే ప్రతి 100 మందికి 105 మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లే.
ఈ విభాగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. గోవా (152 శాతం), కేరళ (115 శాతం), హర్యానా (114 శాతం) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, రాష్ట్రంలోని ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 3.64 కోట్లకు చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది.
ఈ గణాంకాలు రాష్ట్ర ప్రజలు డిజిటల్ సేవలు, సమాచార వినిమయం, ఆన్లైన్ విద్య, లావాదేవీలలో ఎంతగా ఆధారపడుతున్నారో స్పష్టంగా చూపుతున్నాయి. రాబోయే కాలంలో మొబైల్ కనెక్టివిటీ మరింత విస్తరించడం ద్వారా తెలంగాణ అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశించనుంది.