
న్యూస్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా ఉన్న టీమ్ ఇండియా, సొంత గడ్డపైనే వైట్ వాష్ ముంగిట నిలిచింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ముందు ఏకంగా 549 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.
400 పరుగులకు మించి టార్గెట్ను ఛేదించిన చరిత్ర ఏ జట్టుకూ లేదు. దీంతో భారత్ ఆశలన్నీ డ్రా మీదే ఉన్నాయి. కానీ, మంగళవారం ఆట ముగిసే సమయానికి కీలక ఓపెనర్లు జైశ్వాల్ (13), రాహుల్ (6) వికెట్లు కోల్పోవడంతో డ్రా అవకాశాలు కూడా సన్నగిల్లాయి.
ఈ మ్యాచ్తో వైట్ వాష్ జరిగితే, చరిత్రలో తొలిసారిగా ఏడాది వ్యవధిలోనే డబుల్ వైట్ వాష్కు గురైన జట్టుగా భారత్ చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది. నిరుడు న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్ వాష్ అయిన తర్వాత మళ్లీ ఇప్పుడు సౌతాఫ్రికా అదే పని చేయనుంది.
పిచ్ రోడ్డులా ఉందనే విమర్శలు ఉన్నా, సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ రాణించారు. తొలి ఇన్నింగ్స్లో ముత్తుస్వామి సెంచరీ చేయగా, రెండో ఇన్నింగ్స్లో ట్రిస్టన్ స్టబ్స్ 94 పరుగులు చేసి సఫారీలను బలంగా నిలిపాడు.
మరోవైపు భారత్.. తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లోనూ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చూస్తుంటే మనం ఆడుతున్నది దక్షిణాఫ్రికాలోనా అనే అనుమానం కూడా కలిగింది.
ఈ ముప్పును తప్పించుకోవాలంటే బుధవారం టెస్టు చివరి రోజు. టీమ్ ఇండియా అసాధారణ పోరాటం చేయాల్సిందే. బుధవారం రోజంతా నిలబడితేనే మ్యాచ్ డ్రా అవుతుంది. లేదంటే, 0-2తో వైట్ వాష్ పరాభవం తప్పదు.
