
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. LSG బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (65; 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), మార్క్రమ్ (61; 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), నికోలస్ పూరన్ (45; 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఫలితాన్నిచ్చారు.
అయితే, రిషభ్ పంత్ (7) ఈసారి విఫలమయ్యాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, కమిన్స్, హర్షల్, నితీశ్, హర్ష్ తలో వికెట్ తీశారు.
ఇక SRH భారీ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ (59; 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు) విజృంభించగా, క్లాసెన్ (47; 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్), ఇషాన్ కిషన్ (35) కీలక పాత్ర పోషించారు.
LSG బౌలింగ్ విభాగం అదుపు తప్పడంతో విజయాన్ని SRH సునాయాసంగా సాధించింది. దిగ్వేశ్ రాఠీకి 2 వికెట్లు దక్కగా, ఓ రూర్క్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.