
న్యూస్ డెస్క్: తెలంగాణలో జరిగిన ఓట్ల చోరీపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సంఘం వద్ద మూడు కీలక డిమాండ్లు ఉంచారు. దొంగ ఓట్ల వ్యవహారంపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, నామినేషన్ ప్రక్రియ ముగిసేలోపు ఈ విచారణను పూర్తి చేయాలని ఆయన ఎన్నికల అధికారిని కోరారు.
ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా 20 వేల వరకు దొంగ ఓట్ల కోసం ప్రణాళికలు రచించిందని ఆయన ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, విచారణ కోరినట్లు తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వేరే చోట ఓట్ల చోరీ అని గగ్గోలు పెడుతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వారే దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లపై కాంగ్రెస్ తీరు సరిగా లేదని బీఆర్ఎస్ ఆరోపించింది.
ఈ ఫిర్యాదుకు కారణమైన కొన్ని ఉదాహరణలను కేటీఆర్ వివరించారు. నియోజకవర్గంలో ఒక ఇంట్లో 250 ఓట్లు, మరో ఇంట్లో 180 ఓట్లు, ఇంకొక ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయని అన్నారు. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని తనిఖీకి వెళ్లినప్పుడు, వారంతా ఎవరో తనకు తెలియదని ఇంటి యజమాని చెప్పారని పేర్కొన్నారు.
అక్కడకు వెళ్లి చూస్తే అవన్నీ దొంగ ఓట్లు అని తేలిందని ఆయన తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన కేటీఆర్, ఈ వ్యవహారంపై పారదర్శక దర్యాప్తు కోరారు.
