
న్యూస్ డెస్క్: తెలంగాణలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే ఉత్సాహంగా మొదలై, ఏకంగా పది మంది అభ్యర్థులు తమ పత్రాలను దాఖలు చేశారు. అయితే, ఆసక్తికరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరూ మొదటి రోజు బరిలోకి దిగలేదు. దీంతో నామినేషన్ల ప్రక్రియ కాస్త లో-కీగా ప్రారంభమైంది.
తొలి రోజు నామినేషన్లు వేసిన 10 మందిలో ఇద్దరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరఫున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ అభ్యర్థిగా అర్వపల్లి శ్రీనివాసరావు తమ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తదితరులు స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రస్తుతం చిన్న పార్టీలు, స్వతంత్రుల హడావుడితో మొదలైన ఈ ప్రక్రియ, రానున్న రోజుల్లో మరింత వేడెక్కనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగితే ఈ ఉప ఎన్నిక వాతావరణం మారుతుంది.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అంతా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
