
న్యూస్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించారు. ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరితే పార్టీ పెడతానని స్పష్టం చేశారు. లండన్లో ప్రవాస తెలంగాణ వాసులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్గా నిలపాలన్నది తన లక్ష్యమని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం తమ సంస్థ పనిచేస్తుందని, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని గుర్తు చేశారు.
తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ను మునిగిపోతున్న నావగా, బీజేపీ డీఎన్ఏ తనకు సరిపడదని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే తన కసరత్తు అని చెప్పారు.
ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని కవిత గుర్తు చేశారు. కుట్రలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయలేదని వ్యాఖ్యానించారు. తన ఓటమి నుంచి బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో ప్లాన్లు జరిగాయని ఆరోపించారు.
జైలు జీవితం తనలో మార్పులు తెచ్చిందని, నిజమైన మార్పు కోసం ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కొత్త పార్టీపై నిర్ణయం తప్పదని సంకేతం ఇచ్చారు.
ఇక ప్రజలే తాను ఏ దిశగా వెళ్లాలో నిర్ణయిస్తారని కవిత భావం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
