
న్యూస్ డెస్క్: హైదరాబాద్లో ఈ దసరాకు ముక్క ప్రియులకు నిరాశ తప్పదనిపిస్తోంది. పండుగ రోజున ఎప్పటిలాగే మద్యం, మాంసం విస్తృతంగా వినియోగం జరుగుతుందనుకున్నవారికి జీహెచ్ఎంసీ నుండి షాక్ వచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగతో పాటు మహాత్మా గాంధీ జయంతి రావడంతో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారుల ప్రకారం, ఆ రోజు ఎద్దులు, మేకలు, గొర్రెల వధశాలలు మూసివేయాలి. అదేవిధంగా బీఫ్ షాపులు, రిటైల్ మీట్ దుకాణాలు కూడా తెరవకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533(బి) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 24న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించడంతో ఈ ఆదేశాలను సోమవారం అధికారికంగా జారీ చేశారు.
పండుగ రోజున ముక్క లేకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా నడుస్తోంది. మద్యం, మాంసం ప్రియులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అధికారులు మాత్రం గాంధీ జయంతి పవిత్రతను కాపాడేందుకు ఈ చర్య అవసరమని చెబుతున్నారు. పండుగ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
మొత్తానికి ఈ దసరాకు హైదరాబాద్లో ముక్క దొరకదు. కావున ముందుగానే సదుపాయం చేసుకోవడమే మార్గమని అధికారులు సూచిస్తున్నారు.
