న్యూస్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరో ఎన్నిక మారనుంది. అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక. అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైసీపీ తరఫున ఎన్నికైన మేయర్ సురేష్ బాబుని తొలగించడంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యంగా మారింది.
మేయర్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తాజాగా జారీ చేసింది. ఈ నెల 11న జరిగే ప్రత్యేక సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరుగుతుంది అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కొత్త మేయర్గా ఎవరు ఎన్నికైనా పదవీ కాలం కేవలం అయిదు నెలలు మాత్రమే ఉంది.
టీడీపీ వ్యూహం:
ఐదు నెలలే పదవీ కాలం ఉన్నా, కడప గడపలో మేయర్ పీఠాన్ని దక్కించుకుని వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ రెడీ అవుతోంది. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 వార్డులకు గానూ వైసీపీకి 48, టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి బలం ఉంది.
ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు కార్పోరేటర్లు కూటమిలో చేరిపోయారు అని అంటున్నారు. టీడీపీ మేయర్ను గెలిపించుకోవాలి అంటే 26 మంది సభ్యుల బలం ఉండాలి. వైసీపీకి దక్కకుండా చేసి టీడీపీ గెలవాలని చూస్తోంది.
సురేష్ బాబు పిటిషన్:
తనను అకారణంగా మేయర్ పదవి నుంచి తొలగించారని పేర్కొంటూ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై ఈ నెల 9న విచారణ జరగనుందని చెబుతున్నారు.
కోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే మేయర్ ఎన్నికపై పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి సురేష్ బాబు స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్గా నియమించారు. కడప మేయర్ కి ఎన్నికలు జరిగితే మాత్రం తీవ్ర ఉత్కంఠను రేపే అవకాశం ఉంది.
