ఏపీ: ఏదీ ఉచితంగా ఈ ప్రపంచంలో రాదు. ఉచితం అని పేరు పెట్టినా ఆ వెనక భారం మోసేది ఎవరో ఒకరు ఉంటారు. ఒక కుటుంబంలో భార్యకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఖర్చు కలసి వస్తుంది అనుకున్నా, అదే బస్సులో ప్రయాణించే భర్త పెంచిన చార్జీల భారం కూడా మోస్తే ఆ కుటుంబానికి ఆర్ధికంగా ఏమి మిగులుతోంది అన్నదే అసలైన లాజిక్ పాయింట్.
ఉచిత బస్సు నడుపుతున్న రాష్ట్రాలు:
దేశంలో ఉచిత బస్సు మహిళల కోసం నడుపుతోంది కేవలం మూడంటే మూడు రాష్ట్రాలు: కర్ణాటక, తెలంగాణ, ఏపీ. ఈ పథకాన్ని మొదట కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చి అమలు చేసింది.
కర్ణాటకలో భారాలు:
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెను భారం అని అర్థం చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం బస్సు చార్జీలను గణనీయంగా పెంచింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇంధన ధరలు, గత బకాయిలను కవర్ చేయడానికి కర్ణాటక తన నాలుగు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో జనవరి 5, 2025 నుండి 15 శాతం బస్సు ఛార్జీల పెంపును అమలు చేసింది. ఈ పెరుగుదలను ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ప్రభుత్వం సమర్థించింది.
తెలంగాణలో అదే దారి:
తెలంగాణలోనూ 2023 డిసెంబర్ నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకం అమలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణలోనూ ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, హైదరాబాద్లో ప్రతీ టిక్కెట్ ధరపై అదనంగా పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భారం అంతా పురుషుల మీదకే వెళ్తుందని విమర్శలు వినవస్తున్నాయి.
ఏపీలో పరిస్థితి:
ఏపీలో కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు 15 నుంచే ఉచిత బస్సు పధకం అమలు చేస్తున్నారు. అయితే ఇది కొన్ని పరిమితులతో నడుపుతున్నారు. కర్ణాటక తెలంగాణాల మాదిరిగా ఇప్పుడే భారాలు అంతగా పడకపోయినా, ముందు ముందు ఏపీకి కూడా కష్టం నష్టం రావచ్చు అంటున్నారు.
సీనియర్ల మాటలు:
మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదే పదే ప్రభుత్వాలకు హిత బోధ చేస్తున్నారు. ఉచితాలు కేవలం విద్య వైద్యంలో మాత్రమే ఉండాలని ఆయన సూచిస్తున్నారు. ఉచిత బస్సు పధకం మీద ఆయన గతంలోనూ వద్దు అని చెబుతున్నారు. ఈ పథకాల వల్ల ఆర్టీసీలు కుదేలు అవుతాయని హెచ్చరికలు ఉన్నాయి.
