న్యూస్ డెస్క్: క్రికెట్ కెరీర్ స్వల్పకాలమే ఉంటుందని గుర్తించిన టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, భవిష్యత్తు కోసం సరైన బాటలు వేసుకున్నారు. క్రికెటర్లకు ధోని జీవితం ఒక ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మైదానంలో ఎంత కూల్గా, ఫోకస్డ్గా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలోనూ అంతే నిశ్శబ్దంగా లక్ష్యాలను ఛేదిస్తాడు ధోని. అయితే అతనిలో క్రికెట్కు మించిన అపారమైన వ్యాపార దృష్టి ఉంది. సైలెంట్ కిల్లర్గా ధోనీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అంచనాల ప్రకారం, ప్రస్తుతం అతడి వ్యాపారాల విలువ రూ. 1000 కోట్లుగా ఉంది.
చెన్నైతో కొనసాగుతున్న అనుబంధం ధోని వ్యాపార దృక్పథాన్ని కూడా మార్చేసింది. ప్రశాంతంగా, సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ధోనీ నైజం. అదే నైజాన్ని వ్యాపార ప్రపంచంలోనూ అమలు చేస్తూ వైవిధ్యభరితమైన రంగాలలో పెట్టుబడులు పెట్టారు.
ఎంఎస్ ధోని కేవలం ఒకే రంగంలో కాకుండా, భవిష్యత్తులో వృద్ధి ఉన్న పలు వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టారు.
- క్రీడలు: ఇండియన్ సూపర్ లీగ్లోని చెన్నై ఫుట్బాల్ క్లబ్లో ఆయన సహ యజమానిగా ఉన్నారు.
- వాహనరంగం: సెకండ్ హ్యాండ్ కార్ల క్రయ విక్రయాల ఫ్లాట్ఫామ్ కార్స్ 24 లో ధోని పెట్టుబడి పెట్టారు.
- రవాణా: ఎలక్ట్రిక్ సైకిల్స్కు సంబంధించిన స్టార్టప్ ‘ఈ మోటారాడ్’ లో పెట్టుబడి పెట్టడం అతడి దూరదృష్టికి నిదర్శనం.
- సాఫ్ట్వేర్/అకౌంటింగ్: చిన్న మధ్యతరహా వ్యాపారాలకు అకౌంటింగ్ సేవలు అందించే ‘ఖాతాబుక్’ లో కూడా ధోని పెట్టుబడులు పెట్టారు.
- లైఫ్స్టైల్: ‘సెవెన్ బై ఎంఎస్ ధోని’ అనే బ్రాండ్ ద్వారా ఆయన తన లైఫ్స్టైల్ దుస్తులు క్రీడా పరికరాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
క్రికెట్ పిచ్పై ప్రత్యర్థులను అంచనావేసి విజయం సాధించినట్లే, వ్యాపార ప్రపంచంలోనూ భవిష్యత్తు అవకాశాలను అంచనావేస్తూ ధోని 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీంతో ధోని ఇప్పుడు ‘మిస్టర్ కూల్’ తోపాటు మిస్టర్ బిజినెస్ గా కూడా నిరూపించుకున్నాడు.
