
ఉగ్రవాదంపై భారత్ పోరు నిలకడగా కొనసాగుతోందని, పాకిస్థాన్లో దాక్కున్న ఉగ్రవాదులను కూడా వదిలిపెట్టబోమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. నెదర్లాండ్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మకంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 22 తరహా దాడులు పునరావృతమైతే, మరింత కఠినంగా స్పందిస్తాం. ఉగ్రవాదుల ప్రోత్సాహానికి తగిన బదులు ఇవ్వడం భారత్ హక్కు,” అని జైశంకర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, భారత బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు.
మే 10న పాకిస్థాన్ హాట్లైన్ ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదించిందని, ద్వైపాక్షికంగా అది అమల్లోకి వచ్చిందని తెలిపారు. “ఈ ఒప్పందంలో అమెరికా సహా ఎవరి పాత్రా లేదు. ట్రంప్ వాదనల్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాం,” అని స్పష్టత ఇచ్చారు.
కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి అస్పష్టంగా లేదని, అది దేశ అంతర్భాగమని, చర్చల ఎజెండాలో పీఓకే ఖాళీ చేయడం మాత్రమే ఉందన్నారు.