
ఆంధ్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీ కొట్టిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.
గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి రెంటపాళ్లలో పర్యటనకు బయలుదేరారు. ఆయన పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా వాహనాలతో తరలివచ్చారు.
ఇదే సమయంలో ఓ వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాన్వాయ్లోని ఓ వాహనం వృద్ధుడిని బలంగా ఢీకొట్టింది. అతను తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
గాయపడిన వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత కూడా కాన్వాయ్ ఆగకపోవడంపై విరుచుకుపడ్డారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రమాదంతో జగన్ పర్యటనలో నీడలు అలుముకున్నాయి. పార్టీ నైతిక బాధ్యత తీసుకోవాలంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.