
న్యూస్ డెస్క్: ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ప్రజలు తక్షణమే వాట్సాప్ను మొబైల్ఫోన్ల నుంచి తొలగించాలని సూచించింది. యాప్ ద్వారా వినియోగదారుల సమాచారాన్ని సేకరించి ఇజ్రాయెల్కి చేరవేస్తోందని తీవ్ర ఆరోపణ చేసింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా విడుదలైన ప్రకటనలో, సెల్ఫోన్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా కీలక నేతల కదలికలపై గూఢచర్యం జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల అణు శాస్త్రవేత్తలు, సైనిక జనరళ్ల హత్యలు జరిగిన తీరు ఇదే విషయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
వాట్సాప్ తల్లిదండ్రి సంస్థ మెటా దీనిపై స్పందించింది. “మేము యూజర్ల లొకేషన్, వ్యక్తిగత డేటాను ట్రాక్ చేయం. సందేశాలను చదవం. ప్రభుత్వాలతో భారీ స్థాయిలో సమాచారం పంచుకోవడం జరగదు” అని స్పష్టం చేసింది.
ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం, టెహ్రాన్లో మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించిందని వెల్లడించింది. రహస్య ప్రదేశంలో ఉన్న సైనిక అధికారి అలీ షాద్మానీని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడికి ఇదే ఆధారం కావచ్చని అభిప్రాయపడింది.
ఈ పరిణామాలతో, ఇరాన్లో యాంటీ-ట్రాకింగ్ టెక్నాలజీ ఉన్న ఫోన్ల వినియోగంపై నిపుణుల సూచనలు జోరుగా వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో టెక్ గూఢచర్యంపై ఈ వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది.