
న్యూస్ డెస్క్: బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో, 2012 నాటి పరిస్థితి మళ్లీ రిపీట్ అయితే చాలా మంది నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో, స్టాక్ మార్కెట్ ఊపందుకోవడంతో పెట్టుబడులు అటువైపు మళ్లాయి.
ఫలితంగా బంగారం ధరలు ఒకేసారి 25 శాతం వరకు పడిపోయాయి. ఇప్పుడు కూడా పెట్టుబడులు పెట్టిన వారు కాస్త ఆలోచించి అడుగులు వేయాలని సలహాలిస్తున్నారు.
ప్రస్తుతం స్టాక్స్ కంటే బంగారమే బెటర్ అనే సెంటిమెంట్ బలంగా నడుస్తోంది. దీనితో పాటు, గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెండు రెట్లు లాభాలు వచ్చాయి. ఈ సెంటిమెంట్ ఇలాగే కొనసాగితే, మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 1,50,000కు చేరుకోవడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ఎప్పుడూ లక్ష దాటలేదు. కానీ ఇప్పుడు ఆ ధరలు చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో పరుగులు తీస్తున్నాయి. ఈ ధరలకు నిలకడ లేదా? ఎక్కడ ఆగుతాయి? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి.
బంగారం ధరలు ఇలా రోజు రోజుకు పెరిగిపోవడానికి కొన్ని అంతర్జాతీయ ప్రతికూల అంశాలు కారణమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై తీసుకుంటున్న నిర్ణయాలు, డాలర్పై ఫెడ్ రేట్ల ప్రభావం, కొన్ని దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఈ పరిణామాలకు దారితీశాయి.
దీని ఫలితంగా ప్రపంచ దేశాలలోని ముఖ్యమైన బ్యాంకులతోపాటు చైనా, జపాన్ వంటి దేశాలు కూడా బంగారు నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులన్నీ ఇప్పుడు బంగారంపై దృష్టి పెట్టడంతో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజలు భరోసా కోసం కొనుగోలు చేసే బంగారం, ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొనే పరిస్థితి లేకుండా పోయింది.
