
ప్రకాశం జిల్లా: పొదిలిలో జగన్ పర్యటన సమయంలో జరిగిన ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రైతులు, మహిళలు, పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు.
అమరావతి రైతులను కించపరిచేలా ఓ చానెల్ ప్రసారం చేసిన కార్యక్రమంపై నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో జగన్ పర్యటనకు వెళ్లడం పలు రాజకీయ ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారనే ఆరోపణలు వస్తుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ ఘటనలో పలువురు మహిళలు, పోలీసులకు గాయాలు కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై దాడులను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
రైతుల పరామర్శ పేరిట శాంతిభద్రతల సమస్యలు కలిగించడం బాధాకరమని సీఎం అభిప్రాయపడ్డారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలు ముఖ్యమైనవని, అనుమతుల్ని దుర్వినియోగం చేసినవారిని ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు.