
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి గడువు లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో మే 18న ఈ ఒప్పందం ముగుస్తుందని ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన భారత ఆర్మీ అధికారి, “మే 12న డీజీఎంవోల మధ్య జరిగిన చర్చల్లో కాల్పులు నిలిపివేతపై స్పష్టమైన అంగీకారం ఉంది. దానికి ఎటువంటి ఎక్స్ పైరీ డేట్ లేదు” అన్నారు.
ఇరు దేశాల డీజీఎంవోలు మే 12న ఫోన్ సంభాషణలో, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫార్వర్డ్ ఏరియాల్లో బలగాలను తగ్గించుకోవడం, దూకుడు చర్యలకు పాల్పడకపోవడం వంటి అంశాలపై చర్చించారు. ఈ చర్చకు మే 10న పాక్ అధికారి తీసిన ముందడుగు నేపథ్యం.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ, కొత్త చర్చలు ఖరారు కాలేదని ఆర్మీ స్పష్టం చేసింది. విరమణ ఒప్పందం యథాతథంగా అమలవుతోంది.