
హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో గల గుల్జార్ హౌస్లో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. వారం రోజు సెలవు రోజు కావడంతో కుటుంబాలంతా ఇంట్లోనే ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ బహుళ అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్లో ఏసీ పేలి మంటలు చెలరేగడంతో మిగిలిన అంతస్తులకు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో మొదట ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలించిన మరొక 14 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ఉస్మానియా, అపోలో, డీఆర్డీఓ ఆసుపత్రులకు తరలించారు.
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఘటనా స్థలానికి అధికారులను పంపించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, కిషన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
