
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ప్రాజెక్టుపై కీలక చర్చలు జరిపారు.
రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 76.4 కిలోమీటర్ల రెండో దశ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు తక్షణ అనుమతులు ఇవ్వాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుండటంతో మెట్రో ప్రాజెక్టు విస్తరణ అత్యవసరమని వివరించారు.
ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సౌకర్యం పెరిగి, రోడ్ ట్రాఫిక్ తగ్గుతుందని, సుస్థిర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. డీపీఆర్ను సవివరంగా రూపొందించి ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు ఇతర కేంద్ర శాఖల నుంచి కూడా అనుమతులు త్వరగా రావాలంటూ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరించేందుకు ఆసక్తిగా ఉందని సమాచారం.
రెండో దశ మెట్రో హైదరాబాద్ నగరానికి టర్నింగ్ పాయింట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేంద్రం నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందా చూడాలి.
revanth reddy, hyderabad metro, metro phase 2, telangana development, urban transport planning,