
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) అద్భుత విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది.
చివరి బంతికి 3 పరుగులు అవసరమైన సమయంలో రాజస్థాన్ ఆటగాడు రనౌట్ కావడం ముంచుకొచ్చిన గెలుపును చేజార్చేసింది.
కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రస్సెల్ (57 నాటౌట్), రఘువంశీ (44), గుర్బాజ్ (35), రింకూ సింగ్ (19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ సహా నలుగురు తలో వికెట్ తీసారు.
చివరిగా ఛేదనలో రాజస్థాన్ 205 పరుగుల వద్ద ఆగింది. రియాన్ పరాగ్ (95), శుభమ్ దూబే (25 నాటౌట్) పోరాడినా ఫలితం దక్కలేదు. రియాన్ ఔట్ అయిన దశనే మ్యాచ్ మలుపు తిరిగింది. హర్షిత్ రాణా ఆ కీలక వికెట్ తీసి మ్యాచ్ను కేకేఆర్ చేతుల్లోకి చేర్చాడు.
ఆఖరి ఓవర్లో దూబే హ్యాట్రిక్ బిగ్ హిట్లతో విజయం ముంగిట వరకు తీసుకెళ్లినా, చివరి బంతికి 3 పరుగులు అవసరమైన సమయంలో ఆర్చర్ రనౌట్ కావడంతో రాజస్థాన్ పరాజయం చవిచూసింది.
ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచగా, రాజస్థాన్ మరోసారి కీలక మ్యాచ్ను చేజార్చుకుంది.