
న్యూస్ డెస్క్: గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వైసీపీని తిరిగి బలపరచే పనిలో అధినేత జగన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కావడంతో పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యం పాలయ్యారని వచ్చిన విమర్శల తర్వాత, ఇప్పుడు ఆ లోటుపాట్లను సరిదిద్దాలని జగన్ భావిస్తున్నారు.
ప్రస్తుతానికి పార్టీ లోపల చర్చనీయాంశమవుతున్న విషయం.. ఇకపై హైకమాండ్ నిర్ణయం మాత్రమే కాకుండా, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, పదవుల నియామకాల్లో ఆ కమిటీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇకపై వలంటీర్ వ్యవస్థపై ఆధారపడకుండా, నేరుగా కార్యకర్తలే పార్టీ శక్తిగా ఉండాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. దీని ద్వారా గ్రాస్రూట్ స్థాయిలో మళ్లీ వైసీపీ పునరుద్ధరణ జరగాలని ఆశిస్తున్నారు.
కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చురుకుగా పనిచేస్తున్న గ్రామ, మండల స్థాయి నేతలను గుర్తించి, వారికి అవకాశం ఇవ్వాలని జగన్ సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల కొత్త రక్తం పార్టీ యంత్రాంగంలోకి వస్తుందని ఆశిస్తున్నారు.
బుధవారం జరగనున్న రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ అంశంపై పీఏసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో విస్తృత చర్చ జరగనుంది. అదే సమయంలో “టాలెంట్ హంట్” విధానంలో కొత్త నేతలను ముందుకు తేవాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద, వైసీపీ 2.O కింద జగన్ కొత్త వ్యూహం పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, రాబోయే ఎన్నికలకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
