
ఆంధ్రప్రదేశ్: రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న మొదలుకానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు హాజరు కావడం లేదని ఆయన పట్టుబడుతున్నారు.
అయితే, ఈ వైఖరి జగన్కు మరింత డ్యామేజీ తెచ్చిపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
“వైసీపీ స్వయంగా గతంలో చెప్పిన మాటలే ఇప్పుడు వారిపై ఆయుధంగా మారాలి” అన్న ఆలోచనతో పార్టీకి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అప్పటి వీడియోలను మళ్లీ ప్రచారం చేయాలని ఆదేశించారు.
గతంలో సభలో సీఎం హోదాలో ఉన్న జగన్ మాట్లాడుతూ, “టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మావైపు వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు” అని చంద్రబాబుకు ఎదురుగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు తిరిగి హాట్ టాపిక్ అయ్యాయి.
అప్పట్లో వైసీపీ చెప్పిన “10 శాతం ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష హోదా లేదు” అన్న మాటలు ఇప్పుడు తిరగబెట్టేలా మారాయి. ఈ వ్యూహం ద్వారా టీడీపీ ప్రజల్లోకి బలమైన సందేశం పంపాలని చూస్తోంది.
వైసీపీ ఇప్పటికే ఇమేజ్ కోల్పోయిన సమయంలో ఈ అంశం మరింత ఇబ్బంది కలిగించనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో తీరే జగన్ భవిష్యత్ దిశను నిర్ణయించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
