
న్యూస్ డెస్క్: 2024 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత, అధినాయకత్వం తమను పట్టించుకోవడం లేదని వైసీపీ కేడర్ కొంత నిరాశలో ఉంది. అయితే, కూటమి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక జనంలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని భావించిన అధినేత జగన్, ఎట్టకేలకు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన ఇకపై పూర్తిస్థాయిలో జనంలోకి రావడానికి, జిల్లాల పర్యటనలకు ఓకే అన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘గడప గడపకు’ కార్యక్రమం లేకపోవడం, అధినేత అందుబాటులో లేకపోవడంతో నిస్తేజంగా ఉన్న కేడర్కు ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇటీవల కృష్ణా జిల్లా తుఫాన్ పర్యటనకు వచ్చిన అనూహ్య స్పందన కూడా జగన్ మనసు మార్చుకోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది.
నెలకు ఒకటి రెండు జిల్లాల చొప్పున పర్యటనలు ప్రారంభించి, నేరుగా కేడర్ను కలవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పర్యటనల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, బలోపేతం దిశగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ ఆకస్మిక కార్యాచరణ వెనుక మరో కీలక కారణం ఉంది. 2026 ఆరంభంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అధికార కూటమి ఇప్పటికే ఈ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ లోకల్ బాడీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, మూడు పార్టీల కూటమిని ఢీకొట్టాలంటే, కేడర్ను ఇప్పటినుంచే సమాయత్తం చేయడం తప్పనిసరి.
జగన్ జిల్లాల పర్యటనలు మొదలుపెడితే, క్షేత్రస్థాయిలో పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతుందని, లోకల్ ఎన్నికల్లో కూటమికి గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుంటుందని నేతలు భావిస్తున్నారు. ఈ పర్యటనలతోనే లోకల్ ఫైట్కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
