న్యూస్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల సుదీర్ఘ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి, అనంతరం జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ ఎక్కువగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, పవన్ విషయాలను పెద్దగా ప్రస్తావించలేదు.
కానీ ఒక విలేకరి పవన్ “వైసీపీని అధికారంలోకి రానీయమని” చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనికి సమాధానంగా జగన్ “పవన్ చూసేదేమిటీ స్వామీ? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు.. వారే చూస్తారు” అని చమత్కారంగా స్పందించారు.
జగన్ ఎప్పుడూ చెప్పేలా, తనకు దేవుడి దీవెనలు, ప్రజల మద్దతు ఉంటే ఏ కూటమి వచ్చినా తాను గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఇదే ధైర్యం 2014, 2019, 2024 ఎన్నికల్లోనూ తన ప్రసంగాల్లో వినిపించారని ఆయన గుర్తు చేశారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి టీడీపీతో కూటమి కొనసాగుతుందని సూచించే సందర్భంలోనివి. వైసీపీని దూరంగా ఉంచేందుకు ఈ పొత్తులు అవసరమని ఆయన భావించారు. దానికి ప్రతిగా జగన్, ప్రజలే తనకు తుది తీర్పు ఇస్తారని స్పష్టంచేశారు.
