భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దే దిశగా మే 1న ముంబయిలో జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన WAVES (World Audio Visual Entertainment Summit) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం.
ఈ సమ్మిట్లో లైకా ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా 9 అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులను ప్రకటించి ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించాయి. ప్రధానమంత్రి విజన్కు అనుగుణంగా భారతీయ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు రూపొందనున్నాయి.
లైకా గ్రూప్ చైర్మన్ డా. సుభాస్కరణ్ మాట్లాడుతూ, “భారతీయ మూలాలు కలిగిన సంస్థగా ప్రపంచ ప్రేక్షకులకు మన సంప్రదాయాలను అందించడంలో భాగస్వామ్యం కావడం గర్వకారణం” అని తెలిపారు. ప్రపంచ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే కథలను, కంటెంట్ను రూపొందించేందుకు తమ భాగస్వామ్యం కీలకమవుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ కథల్ని, సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయంగా వ్యాప్తి చేయాలన్నది సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టుల్లో భాగమవుతారు.
వేవ్స్ సమ్మిట్తో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త గ్లోబల్ గేట్వే తెరుచుకున్నట్టే అన్న భావన చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతోంది.