
న్యూస్ డెస్క్: 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల సీబీఐ విచారణ పూర్తయిందని ప్రకటించి, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ప్రకటనతోపాటు “మళ్లీ విచారణ చేయాలా?” అన్న సందేహాన్ని కోర్టుకు వదిలేసింది.
కానీ, ఈ విచారణ పూర్తయ్యిందని చెప్పే ముందు సీబీఐ ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. వివేకా కుమార్తె సునీత మాటల ప్రకారం, హత్య వెనక ఉన్న సూత్రధారిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అసలు హత్య ఎందుకు జరిగింది? దానికి ప్రధాన కారకుడు ఎవరు? అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కూడా సీబీఐ పక్షం నుంచి బలమైన వాదనలు లేకపోవడం విమర్శలకు దారితీసింది.
ఇక చార్జిషీట్లు పూర్తయ్యాయా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఒక్కవేళ పూర్తయ్యాయని అనుకుంటే.. విచారణ తెలంగాణ కోర్టులో ఎందుకు ముందుకు సాగడం లేదన్నది మరో అనుమానం. మొదట్లో గుండెపోటుగా అభివర్ణించిన హత్యను సీబీఐ ఎలా పరిశీలించింది? అనేది కీలక అంశం.
వివేకా ఆస్తుల వివాదమే హత్యకు కారణమని చెబుతున్న ఆరోపణలపై సీబీఐ స్పందించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. కేసు విచారణ జరిగితే బాధితుల వాదనల కన్నా, నిందితుల వాదనలకు ప్రాధాన్యం ఏర్పడేలా సీబీఐ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు, డీఎస్పీ రామ్ సింగ్ పాత్ర, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలాలపై విచారణ ఇంకా కొనసాగాల్సి ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇలా కీలక వ్యక్తులపై విచారణ జరగకముందే ‘విచారణ పూర్తయింది’ అని చెప్పడం అసలెంత న్యాయమన్నది గట్టిగా వినిపిస్తోంది.
