
న్యూస్ డెస్క్: బ్యూటీఫుల్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు పొందిన విశాఖపట్నంపై ప్రేమ ఎవరికి ఎక్కువ అనే అంశం ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య పెద్ద డైలాగ్ వార్ కు దారి తీసింది. విశాఖ నగరం ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష వైసీపీకి కేంద్ర బిందువుగా మారింది.
కూటమి ఫోకస్:
కూటమి ప్రభుత్వం అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినా, అది తయారయ్యే వరకు విశాఖ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల భాగస్వాముల పెట్టుబడుల సదస్సును విజయవంతంగా నిర్వహించింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కలిసి తొమ్మిది ఐటీ కంపెనీలకు భూమి పూజ చేశారు.
చంద్రబాబు మంత్రి లోకేష్ విశాఖను ‘గ్రోత్ ఇంజన్’ గా అభివర్ణించారు. ఐటీ హబ్ గా విశాఖ మారబోతోందని, దీని అభివృద్ధిని ఎవరూ ఆపలేరని చెప్పారు. విశాఖ అభివృద్ధి ఏపీకి దశ తిప్పుతుందని చెప్పుకొచ్చారు.
వైసీపీ క్లెయిం:
అయితే వైసీపీ నాయకులు ముందుకు వచ్చి విశాఖ మీద ప్రేమ తమకే ఎక్కువ అని క్లెయిం చేస్తున్నారు. జగన్ హయాంలోనే విశాఖపై ఫోకస్ పెట్టామని, దాని ఫలితాలే ఇపుడు కాగ్నిజెంట్ ఐటీ కంపెనీల రూపంలో వస్తున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు.
పారిశ్రామికంగా విశాఖను అభివృద్ధి చేసే యాక్షన్ ప్లాన్ తమ ప్రభుత్వంలోనే డిజైన్ చేసి అమలు చేశామని, దానినే కూటమి ప్రభుత్వం అనుసరిస్తోందని ఆయన తెలిపారు. ఒకనాడు విశాఖ వద్దన్న చంద్రబాబుకు ఇప్పుడెందుకు ప్రేమ పుట్టుకు వచ్చిందని ప్రశ్నించారు.
బాబు కంటే ఎవరున్నారు?:
దీనికి కౌంటర్ ఇస్తూ, విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పందించారు. చంద్రబాబు కంటే విశాఖను అభిమానించే వారు ఎవరూ లేరని, ఆయన విశాఖ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బాబు ధ్యేయమని అన్నారు.
మొత్తం మీద విశాఖ మీద మాకే ప్రేమ ఎక్కువ అంటే మాకే ఎక్కువ అని టీడీపీ వైసీపీలు పోటీ పడుతున్నాయి. విశాఖ వాసులే ఈ వైజాగ్ లవర్స్ ఎవరో తేల్చాల్సి ఉందని అంటున్నారు.
