
స్పోర్ట్స్ డెస్క్: నిన్న జైపూర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 62 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించిన కోహ్లీ, ఓ దశలో అభిమానులను కలవరపెట్టే సన్నివేశాన్ని సృష్టించాడు.
అర్ధశతకం పూర్తి చేసిన అనంతరం కోహ్లీ ఒక్కసారిగా గుండె పట్టుకున్నాడు. 54 పరుగుల వద్ద ఉన్న సమయంలో గుండె వేగంగా పెల్లుబికినట్లుగా భావించి ప్రత్యర్థి కెప్టెన్ సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లాడు. హార్ట్బీట్ చెక్ చేయమంటూ సంజూ చేతికి సంకేతం ఇచ్చాడు. దీనికి సంజూ స్పందిస్తూ కోహ్లీ ఛాతిపై చేయిపెట్టి పరిస్థితిని అంచనా వేశాడు.
అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఫిట్ క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. అలాంటి ఆటగాడు ఇలా గుండె పట్టుకోవడం చూసి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, వెంటనే కోహ్లీ తన బ్యాటింగ్ కొనసాగించడంతో పెద్దగా ఎలాంటి శారీరక ఇబ్బంది లేదని ఊరట వ్యక్తమవుతోంది.
ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ‘కోహ్లీ ఆన్ ఫైర్.. కానీ ఆ హార్ట్బీట్?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.