న్యూస్ డెస్క్: ద్విచక్ర వాహనదారుల ప్రాణ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలపై దేశవ్యాప్తంగా ఉక్కుపాదం మోపనుంది. రాష్ట్ర ప్రభుత్వాలను దీనిపై అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కేవలం బీఐఎస్ సర్టిఫికేషన్ కలిగిన, ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. భారతదేశంలో 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నందున, రైడర్ల భద్రత అత్యవసరమని వెల్లడించింది.
2021లో కేంద్రం తీసుకొచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం, ఇప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 176 సంస్థలకే బీఐఎస్ లైసెన్స్ ఉంది. ఈ సంస్థలే నాణ్యమైన హెల్మెట్లను తయారు చేయవచ్చు.
బీఐఎస్ అధికారులు మార్కెట్లలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. గతేడాది 500కి పైగా నమూనాలను పరిశీలించగా, దుర్వినియోగం చేస్తున్నవారిపై 30 సోదాలు నిర్వహించి వేల సంఖ్యలో నకిలీ హెల్మెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ లో 9 సంస్థల లైసెన్సులు రద్దు చేయగా, 2,500కు పైగా నాణ్యత లేని హెల్మెట్లను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
కేంద్రం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీసులకు లేఖలు రాసి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించింది.
