
న్యూస్ డెస్క్: 2018లో శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదానికి దారితీశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపాయి. టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది, వైసీపీ ఈ అంశాన్ని బలంగా ఉపయోగించింది.
అయితే తాజాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కీలక స్పష్టత ఇచ్చింది. ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ప్రకారం, ఆభరణం అసలు పింక్ డైమండ్ కాదు, కేవలం కెంపు మాత్రమే. 1945లో మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ ఈ కెంపును శ్రీవారికి బహూకరించారని రికార్డులు చెబుతున్నాయి.
మైసూరు ప్యాలెస్ డాక్యుమెంట్లలో కూడా పింక్ డైమండ్ అనే ప్రస్తావనే లేదని ఏఎస్ఐ స్పష్టం చేసింది. దీంతో ఏడు సంవత్సరాలుగా కొనసాగిన వివాదానికి వాస్తవానికి తెరపడినట్టే అయింది.
2018లో జెనీవాలో డైమండ్ వేలం జరిగిందన్న ఆరోపణలు అప్పుడే టీటీడీ అధికారులు ఖండించినా, రాజకీయ రంగు ఎక్కువైంది. ఇప్పుడు ఏఎస్ఐ క్లారిటీతో అప్పటి ఆరోపణలు నిరాధారమని రుజువైంది.
అదే సమయంలో, ఆ వివాదం రేపిన రోజుల్లో టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ మళ్లీ ఈవోగా తిరిగి రావడం చర్చనీయాంశమైంది. క్లారిటీతో పాటు ఆయన రీ ఎంట్రీ కూడా యాదృచ్ఛికంగా సరిపోవడంతో ఈ అంశం మరింతగా హైలైట్ అవుతోంది.
